అర్థశాస్త్రం ఒక సామాజిక శాస్త్రం. వ్యక్తులు, వ్యవస్థలు వస్తుసేవల ఉత్పత్తి పంపిణీ, వినియోగం లాంటి కార్యకలాపాలలో ఏ విధంగా నిమగ్నమై ఉంటారో అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. మానవుడు పరిమితమైన వనరులతో అపరిమితమైన కోరికలను తీర్చుకోవడంలో నిరంతరం కొనసాగించే ప్రయత్నాలను ఒక క్రమపద్ధతిలో అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది.

                      “అర్థశాస్త్రం”,  “ఆర్థిక వ్యవస్థ” అనే రెండు పదాలు గ్రీకు పదాలైన Okios ( ఒక ఇల్లు) & Nemien (నిర్వహణ) అనే పదాల నుంచి ఉద్భవించాయి. దాని అర్థం ఆర్థిక వ్యవస్థలో గృహ యాజమాన్యం అనే అత్యంత ప్రాముఖ్యమైన అంశాన్ని సూచించే “గృహనిర్వహణ”. 1776 లో ఆడం స్మిత్ ప్రచురించిన రాజ్యాల సంపద స్వభావం, కారకాల పరిశీలనఅనే గ్రంథ ప్రచురణతో “అర్థశాస్త్రం” ఒక ప్రత్యేకశాస్త్రంగా వెలుగులోకి వచ్చింది.

అర్థశాస్త్ర నిర్వచనాలు:

చరిత్ర గమనంలో వివిధ రకాలైన అర్థశాస్త్ర నిర్వచనాలు అభివృద్ధి చేయబడ్డాయి. ప్రతి నిర్వచనాన్ని అధ్యయనం చేయడం సాధ్యం కాదు. సౌలభ్యం కోసం అన్ని నిర్వచనాలను ఈ కింది తరగతుల వారీగా అధ్యయనం చేయొచ్చు.


1. ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనం
2. మార్షల్ సంక్షేమ నిర్వచనం
3. లయోనల్ రాబిన్స్ కొరత నిర్వచనం
4. ఆచార్య శామ్యూల్ సన్ వృధ్ధి నిర్వచనం
5. జాకబ్ వైనర్ నిర్వచనం



1. ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనం:

                          ఆడమ్ స్మిత్ మొదలుకొని సంప్రదాయ ఆర్థికవేత్తలు అర్థశాస్త్రాన్ని సంపద శాస్త్రంగా నిర్వచించారు. ఆడమ్ స్మిత్ తన ప్రఖ్యాతి పొందిన “రాజ్యాల సంపద” అనే గ్రంథంలో అర్థశాస్త్రాన్ని “రాజ్యాల సంపద స్వభావం, కారణాల పరిశీలన” అని నిర్వచించాడు. ఆడమ్ స్మిత్ తో పాటు ఇతర సంప్రదాయవేత్తలు కూడా అర్థశాస్త్రాన్ని సంపద శాస్త్రంగా నిర్వచించారు.
                   
                      జె.బి.సే. నిర్వచనం “సంపద ఏ విధంగా ఉత్పత్తి చేయబడుతుందో, పంపిణీ చేయబడుతుందో, వినియోగింపబడుతుందో వివరించడమే రాజకీయ అర్థశాస్త్రం ఉద్దేశం”. “సంపద స్వభావం, దాని ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన సూత్రాలను అధ్యయనం చేయడమే అర్థశాస్త్ర లక్ష్యం” అని జె.ఎస్.మిల్. నిర్వచించారు. “సంపదకు సంబంధించిన పరిజ్ఞానం అర్థశాస్త్రం” అని వాకర్ నిర్వచించారు.

సంపద నిర్వచనంలోని ముఖ్య లక్షణాలు:

1. మానవుని ఆర్థిక కార్యకలాపాల ముఖ్యోద్దేశం సంపదను ఆర్జించడం.
2. సంపద అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులు.
3. మరింతగా సంపదను పోగుచేసుకోవడమే మానవుని స్వార్థపరమైన ఆలోచన.


విమర్శ:

అర్థశాస్త్రం సంపదను గురించి వివరించే శాస్త్రమనే సంకుచిత భావన వల్ల తీవ్రమైన విమర్శలకు గురైంది.

1. అనేకమంది ఆర్థికవేత్తలు ఈ నిర్వచనాన్ని విమర్శించారు. కార్లైల్, రస్కిన్ అర్థశాస్త్రం సామాన్య మానవుని కార్యకలాపాలను గురించి అధ్యయనం చేయాలిగానీ, ఆర్థిక మానవుని గురించి కాదు అని విమర్శించారు. దాన్ని వారు “దయనీయమైన” శాస్త్రంగా వర్ణించారు.

2. సంపద అనేది మానవ శ్రేయస్సు లక్ష్యసాధనకు ఒక మార్గం మాత్రమే గాని, సంపాదనే మానవుని అంతిమ లక్ష్యం కాదు అనేది మార్షల్ విమర్శ.

3. ఆడమ్ స్మిత్ నిర్వచనం కేవలం భౌతిక కార్యకలాపాలను గురించి మాత్రమే పరిగణలోకి తీసుకొంటుంది. అభౌతిక కార్యకలాపాలైన ఉపాధ్యాయుల, వైద్యుల సేవలను పరిగణనలోకి తీసుకోదు. దీనివల్ల అర్థశాస్త్ర పరిధి పరిమితమై పోతుంది.

4. సంపద నిర్వచనం కేవలం ఉత్పత్తి వైపు మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తోంది. పంపిణీని నిర్లక్ష్యం చేస్తుంది.



2. మార్షల్ శ్రేయస్సు నిర్వచనం:

                          సరికొత్త నిర్వచనాన్ని 1890 లో ప్రతిపాదించడం ద్వారా మార్షల్ అర్థశాస్త్రానికి ఒక గౌరవప్రథమైన స్థానాన్ని కల్పించాడు. సంపద ఉత్పత్తి అనే భావన నుంచి సంపద పంపిణీ అనే భావనకు ప్రాధాన్యతను బదిలీ చేశాడు.

                          మార్షల్ ఉద్దేశంలో “దైనందిన కార్యకలాపాల్లో మానవ ప్రవర్తన గురించి అధ్యయనం చేసేది రాజకీయ అర్థశాస్త్రం;

శ్రేయస్సును సాధించడం కోసం వ్యక్తి, సమాజం ప్రవర్తనను గురించి అధ్యయనం చేస్తుంది. ఈ విధంగా ఒకవైపు సంపదను గురించి అధ్యయనం చేస్తూ మరొకవైపు అధిక ప్రాధాన్యమైన మానవుని గురించి అధ్యయనం చేస్తుంది.

మార్షల్ అనుచరులైన A.C. పిగూ, ఎడ్విన్ కానన్ లాంటివారు కూడా ఈ విధమైన నిర్వచనాలే ఇచ్చారు.

పిగూ మాటల్లో చెప్పాలంటే ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ద్రవ్యంతో కొలవగల సమాజ శ్రేయస్సుకు సంబంధించిన విచారణకే అర్థశాస్త్రం పరిమితమవుతుంది.

ఎడ్విన్ కానన్ అర్థశాస్త్రాన్ని “మానవ జాతి భౌతిక శ్రేయస్సు ఆధారపడే కారణాల వివరణను తెలియజేయటమే రాజకీయ అర్థశాస్త్ర లక్ష్యం” అని నిర్వచించాడు.


ముఖ్య లక్షణాలు:

1. అర్థశాస్త్రం అనే పదాన్ని మార్షల్ “రాజకీయ అర్థశాస్త్రం” అనే పదంలో భౌతికశాస్త్రం లాంటి పదాల పోలికలో ఉపయోగించాడు. నిరంతరం మారుతున్న మానవ స్వభావాన్ని పరిశీలిస్తున్నప్పటికీ అర్థశాస్త్రం ఒక విజ్ఞానశాస్త్రంగా భావించాడు.

2. రాజకీయ, సామాజిక, మత సంబంధమైన విషయాలతో సంబంధంలేని, కేవలం మానవుని ఆర్థిక విషయాలనే అధ్యయనం చేస్తుంది. మానవ సంక్షేమాన్ని పెంపొందింపజేయడానికే అవసరమైన భౌతిక సంపదను సముపార్జించడంలో ఒక వ్యక్తి, సమాజం ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది.

3. సంక్షేమాన్ని పెంపొందింపజేసే మానవ కార్యకలాపాలను గురించి మాత్రమే మార్షల్ నిర్వచనం పరిగణిస్తుంది.

4. మానవునికి, మానవ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తూ సంపద అనేది మానవుని సంక్షేమాన్ని పెంపొందింపజేసే సాధనంగా పేర్కొన్నాడు.

విమర్శ:

             మార్షల్ నిర్వచనం కూడా విమర్శలకు గురైంది. రాబిన్స్ తన “అర్థశాస్త్ర స్వభావం, ప్రాముఖ్యత” అనే గ్రంథంలో “శ్రేయస్సు” అనే భావనను తప్పుపట్టాడు.

1. అర్థశాస్త్రం సామాజిక శాస్త్రం గానీ, మానవశాస్త్రం కాదు. అర్థశాస్త్ర మౌలికసూత్రాలు మానవులందరికీ వర్తిస్తాయి. అందువల్ల అర్థశాస్త్రాన్ని మానవశాస్త్రంగానే తప్ప సామాజిక శాస్త్రంగా పరిగణించరాదు.

2. మార్షల్ నిర్వచనం విభజనాత్మకమైనది. వస్తువులను భౌతిక వస్తువులు, అభౌతిక వస్తువులుగా విభజించడం జరిగింది. చాలా ప్రాముఖ్యమైన “అభౌతిక” వస్తువులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. అందువల్ల ఇది అసంపూర్ణమైనది.

3. శ్రేయస్సును కొలవవచ్చు అనేది తీవ్రమైన అభ్యంతరంగా రాబిన్స్ విమర్శించాడు. శ్రేయస్సు అనేది వ్యక్తిపరమైనది. కాలం, ప్రాంతం, వస్తువులను బట్టి శ్రేయస్సు మారుతుంది.

4. మానవ శ్రేయస్సును పెంపొందించే కార్యకలాపాలను మాత్రమే మార్షల్ పరిగణించాడు. అయితే మద్యం, విషం లాంటివి కూడా శ్రేయస్సు కలుగజేస్తాయి. మార్షల్ వీటిని విస్మరించాడు.

5. వనరుల కొరతను మార్షల్ నిర్వచనం పరిగణించకపోవడాన్ని రాబిన్స్ తీవ్రంగా విమర్శించాడు. రాబిన్స్ అభిప్రాయంలో ఆర్థిక సమస్య అనేది మానవ కోరికలను తృప్తిపరచగలిగే వనరుల కొరతవల్ల ఉద్భవిస్తాయి.


3. రాబిన్స్ కొరత నిర్వచనం:

                          1932 లో రాబిన్స్ తన గ్రంథమైన ‘అర్థశాస్త్ర స్వభావం, ప్రాముఖ్యత’, వ్యాసాన్ని ప్రచురించేంతవరకు మార్షల్ నిర్వచనం ప్రముఖపాత్ర వహిస్తూ వచ్చింది. రాబిన్స్ నిర్వచనంలో పూర్వ నిర్వచనాల్లో లోటుపాట్లు, అసంపూర్ణతలను హేతుబద్ధంగా వెలికితీస్తూ కొత్త నిర్వచనాన్ని ప్రతిపాదించాడు. అర్థశాస్త్రానికి అధిక శాస్త్రీయమైన నిర్వచనాన్ని ఇచ్చాడు.

రాబిన్స్ మాటల్లో ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన పరిమిత వనరులకు, అపరిమిత కోరికలకు మధ్య మానవుని ప్రవర్తనను గురించిన అధ్యయనమే అర్థశాస్త్రం.

ముఖ్య లక్షణాలు:

1. మానవుని కోరికలు అపరిమితం : అనుదిన జీవితంలో అనేక కోరికలను తీర్చుకొంటూ ఉంటాం. ఒక కోరిక తీరిన వెంటనే మరికొన్ని కోరికలు పుడతాయి. అందువల్ల కొన్ని అత్యవసరమైన కోరికలను మాత్రమే తీర్చుకోవలసి ఉంటుంది.

2. వనరులు అపరిమితం : కోరికలు తీర్చుకోవడంలో అందుబాటులో ఉన్న వనరులు పరిమితం. ఇలాంటి పరిమితమైన వనరులతో అపరిమితమైన కోరికలు తీర్చుకోవడంలో ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయి.

3. వనరులకు ప్రత్నామ్యాయ ప్రయోజనాలు
                             వనరులు పరిమితమైనవే కాకుండా ప్రత్నామ్యాయ ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఉదా: విద్యుత్ గృహాలలో, పరిశ్రమల్లో వినియోగించబడుతుంది. భూమిని వరి లేదా గోధుమలను పండించడానికి ఉపయోగించవచ్చు. పరిమితమైన వనరు ఒక కోరికను తీర్చుకోవడానికి ఉపయోగిస్తే ఇతర కోరికలను తీర్చుకొనే విషయంలో తక్కువ పరిమాణంలో అందుబాటులో ఉంటాయి. ప్రత్యామ్నాయ ఉపయోగాల మధ్య మానవుడు ‘ఎంపిక’ చేసుకోవలసి ఉంటుంది.

4. మానవుడు కోరికల మధ్య ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.


రాబిన్స్ నిర్వచనం ఆధిక్యత:

ఇతర నిర్వచనాలకంటే రాబిన్స్ నిర్వచనం అనేక విషయాల్లో మెరుగైనది. కారకాలు కింది విధంగా పేర్కొనవచ్చు.

1. ఇది విభజనాత్మకమైనది కాదు. ఇది మానవుని అన్నిరకాలై‌న కార్యకలాపాలను పరిగణిస్తుంది.

2. సర్వజనామోదం పొందిన నిర్వచనం. అన్ని రకాల సమాజాలకు ఆచరణీయమైంది. ఎందుకంటే వనరులు కొరత అందరు వ్యక్తులు, సమాజాలు ఎదుర్కొనే సమస్య.

3. అర్థశాస్త్రం లక్ష్యాల మధ్య తటస్థంగా ఉంటుంది. నిశ్చయాత్మక శాస్త్రం కావడం వలన ఇది ఎలాంటి నైతిక సంబంధమైన నిర్ణయాలు చేయలేదు.


విమర్శ

మార్షల్ అనుచరులైన డర్బిన్, ఫ్రేజర్, బెవరిడ్జి, ఊటన్ లాంటివారు రాబిన్స్ నిర్వచనాన్ని విమర్శించారు. రాబిన్స్ నిర్వచనంలో మానవీయత లేదనీ అది వ్యక్తిగతమైనది, నిర్వికారమైనది, తటస్థమైనది, ఎలాంటి నైతికమూ నిర్ణయాత్మకమైన అంశం లేనిదని విమర్శించారు. మానవ శ్రేయస్సుకు సంబంధించిన ఒక శాస్త్రంగా అర్థశాస్త్రాన్ని నిర్వచించలేదు. ‘నిర్జీవ ప్రయత్నంగా’ను ప్రవర్తనా సంబంధమైనది గాను కొందరు దీనిని విమర్శించారు.

1. మార్షల్ శ్రేయస్సు నిర్వచనాన్ని విమర్శించినప్పటికీ పరోక్షంగా ‘శ్రేయస్సు’ అనే భావనను రాబిన్స్ తన నిర్వచనంలో ప్రవేశపెట్టాడు. కాబట్టి శ్రేయస్సు నిర్వచనం విమర్శలన్నీ దీనికి కూడా వర్తిస్తాయి.

2. ‘లక్ష్యాలు’ ‘సాధనాలు’కు మధ్య భేదాలను రాబిన్స్ నిర్వచనం పేర్కొనలేదు. ఎందుకంటే సాధనాలు అనేవి అనుభవించడానికి వనరులు మాత్రమే. ‘లక్ష్యాలు’ అంటే సంతృప్తి. అందువల్ల అనుభవించడం, సంతృప్తి రెండూ ఒక్కటే.

3. అర్థశాస్త్రం అనేది లక్ష్యాలకు, సాధనాలకు మధ్య తటస్థంగా ఉంటుందనే అంశాన్ని ఆర్థికవేత్తలు విమర్శించారు. అర్థశాస్త్రం భౌతికతతో మాత్రమే కాకుండా మానవ ప్రవర్తనను కూడా పరిగణిస్తుంది.

4. రాబిన్స్ అర్థశాస్త్రాన్ని ఒక నిశ్చయాత్మక (Positive) శాస్త్రంగా పేర్కొన్నాడు. అయితే మాక్ ఫీ అభిప్రాయంలో అర్థశాస్త్రం మౌలికంగా నిర్ణయాత్మకమైనది (Normative) కానీ రసాయన శాస్త్రంలాగా నిశ్చయాత్మకమైంది (Positive) కాదు.

5. మారుతున్న చలన ఆర్థిక వ్యవస్థలకు రాబిన్స్ నిర్వచనం వర్తించదు. అంతేకాకుండా కాలానుగుణంగా వనరుల కొరత సమస్యను అధిగమించే వీలుంది.

6. శ్రీమతి జోన్ రాబిన్సన్ ‘వనరుల కొరత’ అంశాన్ని తీవ్రంగా విమర్శించారు. ఉన్న వనరులను నిరుపయోగంగా ఉంచకుండా ఎంత బాగా ఉపయోగిస్తామనేది ముఖ్యం.


4. శామ్యూల్ సన్ వృద్ధి నిర్వచనం : అమెరికా దేశానికి చెందిన నోబెల్ (1970) బహుమతి గ్రహీత ఆచార్య పాల్.ఎ. శామ్యూల్ సన్ అర్థశాస్త్రానికి వృద్ధి నిర్వచనాన్ని ప్రతిపాదించాడు. ఈ నిర్వచనంలో కాలం అనే మూలకం, చలనగుణం, ఇమిడి ఉన్నాయి. అందుకే ఇది వృద్ధి సంబంధిత అర్థశాస్త్ర నిర్వచనంగా పిలువబడుతుంది.

                            శామ్యూల్ సన్ నిర్వచనం ప్రకారం “వర్తమాన భవిష్యత్ వినియోగానికి గాను ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులను ద్రవ్యాన్ని ఉపయోగించి గాని, ఉపయోగించకుండా గాని, వివిధ వస్తువులను ఉత్పత్తి చేసి, పంపిణీ చేయడంలో మానవుడు, సమాజం ఏవిధంగా ఎంపిక చేస్తారో అధ్యయనం చేసేది అర్థశాస్త్రం”.

ముఖ్యాంశాలు:

1. రాబిన్స్ నిర్వచనం లాగ, ఈ నిర్వచనం కూడా వనరులు పరిమితంగా ఉండటమే కాకుండా వివిధ రకాల ఉపయోగాలు కలిగి ఉంటాయని తెలుపుతుంది.

2. వర్తమాన, భవిష్యత్ వినియోగం, ఉత్పత్తి, పంపిణీలను గురించి వివరిస్తుంది. అందువల్ల ఇది చలన స్వభావం కలిగినది.

3. చలన వ్యవస్థలో ఎంపిక సమస్యను గురించి ఈ నిర్వచనం చర్చిస్తుంది. ఈ నిర్వచనం అర్థశాస్త్ర పరిధిని విస్తృతపరిచింది.

4. రాబిన్స్ నిర్వచనం కంటే శామ్యూల్ సన్ నిర్వచనం మెరుగైనది. ఎందుకంటే వనరుల కొరత అనే అంశం నుంచి ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగిత ఆపై ఆర్థికవృద్ధి లాంటి సమస్యల చర్చకు మారింది.


5. జాకబ్ వైనర్ నిర్వచనం: 
జాకబ్ వైనర్ నిర్వచనాన్ని అర్థశాస్త్రానికి ఇచ్చిన ఆధునిక నిర్వచనంగా పేర్కొనడం జరిగింది. అమెరికా ఆర్థికవేత్త అయిన ఈయన స్వల్పకాల, దీర్ఘకాల వ్యయరేఖల విశ్లేషకులలో ప్రసిద్ధి చెందాడు.

“ఆర్థికవేత్తలు ఏమిచేస్తారో అదే అర్థశాస్త్రం” అని జాకబ్ వైనర్ అర్థశాస్త్రాన్ని నిర్వచించాడు.

లక్షణాలు ఏవైనా వివిధ ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక వేత్తలు కొన్ని మౌలికమైన సమస్యలను గురించి ఆందోళన కలిగి ఉంటారు.